ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

  • ఏబీ వెంకటేశ్వరావుపై సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్
  • ఇప్పటికే సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కారు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 6 తర్వాత విచారణ జరగవచ్చని తెలుస్తోంది. కాగా, ఏబీ వెంకటేశ్వరావు ఇప్పటికే సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించింది. దాంతో ఏబీ తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ క్యాట్ ను ఆశ్రయించినా, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. క్యాట్ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఏబీ దాఖలు చేసిన దరఖాస్తును తోసిపుచ్చింది.

దాంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, ఆయనకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని, సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతన బకాయిలను కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Andhra Pradesh
Supreme Court
AB Venkateswara Rao
Suspension
AP High Court

More Telugu News